ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటినుంచో వస్తున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముహుర్తం ఫిక్స్ చేశారు. జూలై 8న అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. ఇళ్లపట్టాల పంపిణీ అంశంపై అధికారులతో జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జూలై 8 లోపే మిగతా పనులన్నీ పూర్తిచేయాలన్నారు. లబ్దిదారులు మిగిలిపోయారన్న విజ్ఞప్తుతు తన వద్దకు రాకూడదని అధికారుల్ని ఆదేశించారు. మరో 15 రోజుల్లో గ్రామ సచివాలయాల్లో లబ్దిదారుల జాబితా పెట్టాలన్నారు. తనకు ఓటు వేయని వారికి కూడా ఇంటి పట్టా దక్కాలన్నారు. అర్హత ఉన్న వారు ఎవరూ కూడా తనకు ఇళ్ల పట్టలేదని చెప్పకూడదన్నారు జగన్.
కరోనా వైరస్ కారణంగా ఉగాదికి చేపట్టాల్సిన ఈ కార్యక్రమం వాయిదా వేస్తూ వస్తోంది జగన్ సర్కార్. కరోనా నివారణకు చర్యలు చేపడుతున్నందున ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఉగాదికి బదులుగా ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. తాజాగా మరోసారి పట్టాల పంపిణీ తేదీని మార్చారు. మొత్తం ఇళ్ల స్థలాల కోసం 43,141 ఎకరాల భూమిని సిద్ధం చేస్తున్నారు. ఇందులో 26,976 ఎకరాల ప్రభుత్వ భూమిని, 16,164 ఎకరాల ప్రైవేట్ భూమిని ఇందుకోసం సిద్ధం చేశారట. మార్చి 25 న ఇవ్వబోయే భూములకు జగనన్న కాలనీలు అనే నామకరణం చేసినట్టుగా మంత్రులు ఇప్పటికే పేర్కొన్నారు.